Saturday, February 26, 2011

ఈ వయసులో అక్రమ సంబంధమా ?


ఆడక:
 మీరు మధుమేహ వ్యాధికి మందులు పెద్దగా అవసరం లేదని అంటున్నారు. కానీ డాక్టర్ల దగ్గరకు పోతే ఐదు, ఆరు రకాల మందులు రాస్తున్నారు. మేము ఎలా అర్థం చేసు కోవాలి?                  - ఆర్.కె.ఎస్. (ఈ మెయిల్ ద్వారా)

జవాబు: మధుమేహం వచ్చాక ముందుగా జీవన సరళిని మార్చు కోవాలి. సరైన జీవన సరళి పాటిస్తున్నా అదుపులో లేనప్పుడు ‘మాత్రమే’ మందులు వాడాలి. మందులు వాడుతున్నాం కదా అని జీవన సరళిని సడలించ కూడదు. మధుమేహం ఉందని రోగ నిర్ధారణ జరిగాక దాన్ని అదుపులో ఉంచు కోవటంలో రోగి ఏమి చేయాలో, ఎలాంటి నిబంధనలు పాటించాలో డాక్టరు అవగాహన కలిగించాలి. అది వారి బాధ్యత. వాటిని పాటించి జబ్బును అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత కేవలం రోగిదే. డాక్టరు తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు ఇంకో సమర్థుడిని వెతు క్కోవటం తప్ప మరో దారి లేదు. డాక్టర్లు చెప్పినా రోగి ధోరణి మారనప్పుడు మందులు రాయటం తప్ప వారు కూడా చేయగలిగింది ఏమీ లేదు. మరో వైపు డాక్టర్లందరిలో ఒకే రకమైన నైపుణ్యం, మెళకువలు, నిబద్దత ఉంటాయని ఆశించ వద్దు. మీకు మంచి డాక్టరు దొరికతే మీ బాధ్యత మరింత పెరగాలి. మీ జబ్బు పట్ల మీకే నిబద్ధత లేనప్పుడు ఎంత మంచి డాక్టరు అయినా చేయగలిగింది ఏమీ లేదు. అయనా మీరు సమర్థత ఉన్న తిండి నిపుణురాలు (న్యూట్రీషనిస్టు)ని కలవండి.

అడక: మా వారి వయస్సు 68. హెడ్ మాస్టరుగా రిటైర్ అయ్యారు. మామూలుగా చాలామంచి వారు. ఈ మధ్యన ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ప్రవర్తనవల్ల మా ఇంట్లో నేనూ, పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నాం.
ఎప్పుడూ లేనిది గత ఆరు నెలలుగా నా శీలాన్ని శంకిస్తూ పిల్లల దగ్గర మాట్లాడుతున్నాడు. ఇంటికి ఏ వయసు మగవారు వచ్చినా వారు నా కోసమే వస్తున్నారని అనుమానిస్తున్నారు. పిల్లలు నాకు సపోర్టుగా మాట్లాడితే వారే నా చేత పరువు తక్కువ పని చేయిస్తున్నారని తగువుకి దిగుతున్నారు. ఈ మధ్య పెద్దబ్బాయి ఆయన మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఆయనకు బీపీ, షుగరులాంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. గత కొంతకాలంగా మతిమరపు ఉంది. ఇప్పుడు పెరిగినట్టు అనిపిస్తోంది. కాఫీ తాగి కూడా నాకు కాఫీ ఇవ్వలేదు అని మళ్లీ అడుగుతారు. ఈ మధ్య నిద్ర కూడా సరిగ్గా పోవటం లేదు. పరువుగల కుటుంబం ఎవరితో చెప్పు కోలేక సతమతమవుతున్నాం. ఈ సమస్య నుండి ఎలా బయట పడేది?                  - రాజ్యలక్ష్మి, అనంతపురం

జవాబు: మీరు రాసిన లక్షణాలను బట్టి మీ వారు బహుశాః ‘ఆల్జీమర్సు’ అనే మెదడుకు సంబంధించిన జబ్బుతో బాధ పడుతున్నట్టు అర్థం అవుతుంది. మతి మరుపు ఈ జబ్బులో వచ్చే ముందు లక్షణం, క్రమంగా మతి మరుపు పెరుగుతూ రాను రాను ప్రవర్తనకు సంబంధించిన లక్షణాలు చోటు చేసుకుంటాయి. అందులో భాగంగానే సైకోసిస్సు లక్షణాలు కనిపిస్తాయి. మిమ్మల్ని అనుమానించటం కూడా ఈ సైకోసిస్సులో ఒక భాగం. కాబట్టి మీ మీద చెప్పే అనుమానాలు అన్నీ జబ్బు లక్షణాలుగా పరిగణిస్తే ముందుగా మీరు, మీ పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ మెదడులో నాడీ కణాలు పాడుకావటం కొంత సాధారణమే అయినా ఈ జబ్బు వచ్చినప్పుడు నాడీ కణాల చాలా ఎక్కువగా పాడవుతుంటాయి. దాంతో మెదడు పరిమాణం తగ్గుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు మెదడు ‘తెలివి’లో తరుగుదల ఉంటుంది. తలకు సీటీ స్కాను చేసి మెదడు ఎలా ఉందో చూడాల్సి ఉంటుంది. మనసును పరీక్షించి, తెలివి, జ్ఞాపక శక్తిని అంచనా వేసి జబ్బు తీవ్రతను అంచనా వేస్తారు. పాడైపోయిన మెదడును ఏమీ చేయలేము కానీ మరీ ఎక్కువ పాడు కాకుండా కొంత నిదాన పరిచేందుకు మందులు ఉన్నాయి. అలాగే సైకిసిస్సుకు మందులు వాడితే అనుమానాలు పూర్తిగా తగ్గుతాయి. మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రాంతంలో ఉన్న న్యూరాలజిస్టును కానీ సైకియాట్రిస్టును కానీ సంప్రదించండి.

ఆడక: నా వయస్సు 26. భార్యకు 24, మాకు వివాహం అయి ఏడు నెలలు అవుతుంది. రెగ్గులర్‌గా సెక్సులో కలుసుకుంటున్నాము. ఇద్దరం బాగా ఆనందిస్తున్నాము. ఇంత వరకూ మా ఆవిడకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంట్లో వాళ్ళు, బంధువులు ఇంకా కడుపు రాలేదా! మా ఇద్దరినీ ఎత్తి పొడుస్తున్నారు. అని మాలో ఏదైనా లోపం ఉందంటారా? ఇప్పుడు మేము ఏమి చేయాలి?                                                                                                - వి.ఎల్.ఎన్., నిజామాబాద్

జవాబు: మీకు పెళ్ళి అయి ఏడు నెలలే కదా అయింది. ఇప్పుడే ఆ విషయం మీద ఆందోళన చెందటం అనవసరం. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ పిల్లలు పుట్టటం కొంత ఆలస్యం జరగవచ్చు. పెళ్ళయ్యాక రెండేళ్ళు క్రమం తప్పకుండా సెక్సులో పాల్గొంటున్నా గర్భం రాకపోతే అప్పుడు దాన్ని గురించి ఆలోచించాలి. లోపం ఉందా లేదా అని ఇప్పుడే వెతకటం అనవసరం. మహిళల్లో బహిస్టుకీ బహిస్టుకీ మధ్య రోజును గుర్తించి, దానికి ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజులు కలుపుకొని ఆ మొత్తం ఏడు రోజుల్లో క్రమం తప్పకుండా సెక్సులో కలవండి. ఫలితం ఉంటుంది. రెండేళ్ళు దాటాక కూడా గర్భం రాకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి.

ఆడక: తెలివి పెరగటానికి మందులు ఉన్నాయా?                                                   - పేరు రాయని ఇంటర్ విద్యార్థి

జవాబు: తెలివిని పెంచేందుకు మందులు కానీ, ఆహార పదార్థాలు కానీ ఏమీ లేవు. ఉన్నాయని ఎవరైనా చెబితే అది పూర్తిగా అబద్ధం. పుట్టేటప్పుడే మెదడు దానిదైన సామర్థ్యంతో (ముడి సరుకు) పుడుతుంది. ఎదుగుదలలో లోపం రానంత వరకూ (జబ్బుల వలన కానీ, తిండిలో లోపం వల్ల కానివ్వండి) దాని సామర్థ్యానికి తగ్గట్టు పని చేయటానికి సత్తా ఉంటుంది. మనం చేసేదల్లా శిక్షణ పొందటం ద్వారా దానికి పదును పెట్టటమే. అలా ఎవరికి వారు ఉపయోగంలోకి తెచ్చుకొనేదే వారి ప్రతిభ. మరో సంగతి ఏమిటంటే పుట్టుకతో సామర్థ్యం ఎక్కువగా ఉన్నంత మాత్రాన దానిని ఉపయోగించకపోతే (చదవటం లేదా నేర్చుకోవటం) ప్రతిభగా మారదు. అలాగే సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ దానికి పదును పెట్టి, పూర్తిగా ఉపయోగించుకుంటే అదే తెలివి పెరిగినట్టు లెక్క.


No comments:

Post a Comment