Wednesday, December 29, 2010

కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి ? పార్టు - 2

నిత్య జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, తోటి పనివారు ‘కోపం’ వచ్చినప్పుడు దానిని ఎలా చూపిస్తారనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని చూడండి! అటు ఉగ్రరూపంతో ఊగిపోయే వారినుండి ఇటు ఏ మాత్రం తొణక్కుండా సర్దుకుపోయే వారి వరకూ అనేక స్థాయిల్లో మన కళ్లముందు మెదులుతారు. కోపాన్ని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కోపం రావడానికి అవసరం అయిన అన్ని దినుసులు ‘మన’లో ఉన్నా, దాన్ని పొడిచి లేపేది మాత్రం ‘బయటి’ కారణాలే. అయితే వచ్చిన కోపం ఎలా ప్రదర్శించాలనేది మాత్రం ‘మనలో’ ఉంటుంది. మనలో మూడు అంశాలు కోపాన్ని నియంత్రిస్తాయి.

  1. వ్యక్తి కోప స్వభావం
  2. వారిలో ఉన్న ఓర్పు
  3. కోప కారకులతో ఉన్న సంబంధం
ఈ మూడు సందర్భాన్ని బట్టి అటు కోపాన్ని పెంచడం కానీ, ఇటు తగ్గించడం కానీ చేస్తాయి. అలాగే కోపాన్ని ఏ రూపంలో చూపాలి, ఎంత వేగంగా చూపాలి అనేది నిర్ణయిస్తాయి.


కోప స్వభావం: కొందరికి మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. వారికి వచ్చే ఆలోచనలు, చేసే పనులు సరాసరి వ్యక్తులకన్నా వేగంగా ఉంటాయి. వీరి ప్రవర్తన, శరీర కదలికలు దానికి తగ్గట్టే ఉంటాయి. ఇలాంటి వారిలో కోపం విడుదల వేగంగా ఉంటుంది. అయితే ఇది జబ్బు కాదు. సహజ స్వభావం.

కొన్నిరకాల మానసిక జబ్బుల్లో మెదడు అతి చురుకుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కనిపించే ‘తులవతనం’ లేదా అతి చురుకుదనం (ADHD), మానియా, కొన్ని రకాల స్కిజోఫ్రెనియా జబ్బుల్లో, మెదడు చురుకుదనం చాలా ఎక్కువ అవుతుంది. ఇవి కాక మెదడును ప్రేరేపించే మాదక ద్రవ్యాలు వాడినప్పుడు కూడా మెదడు చురుకుదనం ఎక్కువ అవుతుంది. ఇలాంటి వారు ఆ సమయంలో సహజ స్వభావానికి భిన్నంగా చిన్న కారణానికి కూడా ఉన్నట్టుండి కట్టలు తెంచుకున్నట్టు (Impulsive) కోపాన్ని చూపుతారు. జబ్బు తగ్గగానే యధాస్థితికి వస్తారు.

ఓర్పు: ఇక ఓర్పు విషయానికి వస్తే ప్రతి వారికి కొంత ఓర్పు సహజంగానే ఉంటుంది. మనకు ఉన్న ఓర్పును పది పాయింట్ల స్కేలుమీద మనమే ఊహించుకోవచ్చు. చాలా చిన్న విషయాన్ని కూడా ఓర్పులేనివారు ఒకటో పాయింటులో ఉంటారనుకుంటే, ఎంత రెచ్చగొట్టినా ఏమాత్రం సడలని వారు పదో పాయింటులో ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర వారిదయిన ఓర్పు పాయింటు(Threshold) ఉంటుంది. కోపానికి కారణమయ్యే సంఘటన జరిగినప్పుడు తమ ఓర్పు పాయింటు వరకు సహనాన్ని చూపుతారు. ఈలోగా సంఘటన సమసిపోయిందంటే పర్వాలేదు. కానీ అవతలి వారు తెగేదాకా లాగితే ఇక సహనం నశించి ఉగ్రరూపులు అవుతారు. మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఓర్పు 10-దో పాయింటులో ఉంటుంది. శిశుపాలుడు తన మాటలతో శ్రీకృష్ణుడిని రెచ్చగొడుతుంటే తన ఓర్పును 10-దో పాయింటు వరకూ వక్కలు లెక్క పెట్టుకుంటూ గడిపి, అది దాటగానే ఆయుధాన్ని వదిలి తల నరికేస్తాడు. అదే ఏ భీముడో అయివుంటే, ఓర్పు తక్కువ కాబట్టి ఆ పని 2-డో పాయింటులోనే జరిగి ఉండేది. ఓర్పు వచ్చే కోపాన్ని కొంత ఆపగలదే కానీ అసలు రానీయకుండా నివారించలేదు. కాకుంటే ఉగ్గబట్టుకునేట్టు చేస్తుంది. వ్యక్తులను, సంఘటనలను అర్ధం చేసుకోలేనివారు, ఎదుటివారి దృష్టితో ఆలోచించలేని వారికి ఓర్పు తక్కువ. అహంభావం, ఆధిపత్య ధోరణులు ఉన్నవారు, ఇతరుల హక్కుల్ని అంగీకరించని వారికి కూడా ఓర్పు తక్కువగా ఉంటుంది. వీటికి భిన్నంగా ఉండే వారికి సహజంగానే ఓర్పు ఎక్కువగా ఉంటుంది.

సంబంధాలు: వచ్చిన కోపాన్ని ఏ రూపంలో ఎంత స్థాయిలో చూపాలనేది ఎవరిమీద కోప్పడుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తితో వున్న సాన్నిహిత్యం, పగ, ఆ వ్యక్తి వయసు, సామాజిక హోదా, ఆర్థిక స్థితి మొదలైన అంశాలమీద ఆధారపడి వుంటుంది. చెప్పిన మాట విన్నప్పుడు పిల్లలపై ఎక్కువగా కోప్పడతారు. అదే పెద్దవారు విననప్పుడు అంతగా కోపం చూపరు. అలాగే స్నేహితులు ఎగతాళిగా మాట్లాడితే చిరుకోపం చూపే వ్యక్తి గిట్టని వారు ఎగతాళి చేసినప్పుడు చాలా తీవ్రంగా కోపం చూపిస్తారు.
పైన చెప్పిన మూడు అంశాలు కోపం ప్రదర్శించిన వ్యక్తికే కాకుండా కోపాన్ని భరించాల్సిన వ్యక్తికి కూడా వర్తిస్తాయి. ఒకరు కోప్పడినా, అది గొడవగా మారడమా, సద్దుమణగడమా అనేది ఇరువైపులా ఈ అంశాల ప్రాతిపదికనే ఉంటుంది. జరిగే నష్టం వీటినిబట్టే ఉంటుంది.
జీవ లక్షణమైన కోపాన్ని సామాజిక పరిస్థితులకు తగ్గట్టు వెలువరించడంలో ఇన్ని వడపోతలు ఉన్నా వాటిని దాటుకుని ముక్కుమీద కోపాన్ని ప్రదర్శిస్తుంటే, దానివల్ల వచ్చే సామాజిక నష్టాలు ఇలా ఉంటాయి.
  • మానవ సంబంధాలు దెబ్బతింటాయి
  • పగ, ప్రతీకారాలకు కారణం అయి, డబ్బు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది
  • కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు కారణం అవుతుంది.
  • పరువు బజారుకు ఎక్కుతుంది.
  • వృత్తి, దానికి సంబంధించిన వివిధ రకాల నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.
  • వ్యాపార లావాదేవీలలో తేడా వచ్చి ఆర్థికంగా నష్టపోతారు.
  • హింసా చర్యలకు పాల్పడి నేరస్తులుగా మారడానికి అవకాశాలు పెరుగుతాయి.
  • ఆరోగ్యం పాడయితే ఆర్థిక భారం పడుతుంది.

ఇక ఆరోగ్యకరమైన అంశాలకు వస్తే, అవసరం అయిన దానికంటే ఎక్కువగా తరచు కోపదారి ప్రవర్తన ఉండేవారికి రక్తపోటు, మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండెపోటు, పక్షవాతం లాంటి వయసుతో ముడిపడ్డ జబ్బులు రావాల్సిన వయసుకంటే కాస్త ముందు గానే రావడానికి అవకాశం ఉంది.

Wednesday, December 22, 2010

కోపాన్ని ఎలా తగ్గించు కోవాలి ? పార్టు - 1

నిర్లక్ష్యంగా  ఆటో తోలుతూ తన కారుకి అడ్డం వచ్చిన ఆటో వాడిని నిలిపి తిట్టాడు గోపాల రావు. వాడు ఎదురు తిరిగాడు. మాట మాట పెరిగి ఆటో వాడిపై చెయ్యి చేసుకున్నాడు. విషయం పోలీసుల దాకా పోయింది. ఆ గొడవ నుండి బయట పడటానికి ఓ వెయ్యి నోటు వదిలింది. కాలేజీ నుంచి ఓ అరగంట ఆలస్యంగా వచ్చిన కూతురి మీద కారణం అడగకుండా కోప్పడింది తల్లి కనక మహాలక్ష్మి. అంతే ఆవేశంతో గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరేసుకుంది కూతురు కోమల. శ్యామలరావు ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. నిజాయితీ పరుడేకాక పనిలో దిట్ట. కానీ ముక్కు మీద కోపం ఉండటంవల్ల తోటి ఉద్యోగులతో సంబంధాలు సజావుగా లేవు. మేనేజరు ప్రమోషను లిస్టులో ఉన్నాడు. కేవలం కోపదారి ప్రవర్తన వల్ల అతనికంటే జూనియరు, సౌమ్యుడు అయిన రాజారావు ఆ పోస్టును ఎగరేసుకు పోయాడు. అవధులు దాటే కోపం వల్ల జరిగే అనర్థాలు అనేకం.

                                        *********************************

ఇన్ని అనర్థాలకు కారణం అయిన కోపం ఎందుకు వస్తుంది? ఒకే సంఘటనకు ఒకరికి కోపం రాగా మరొకరికి ఎందుకు రాదు? మెదడులో ఉన్న కోప యంత్రాంగం మర్మాలు ఏమిటి? కోపాన్ని కోపంగానే ప్రదర్శించాలా? మార్చి ప్రదర్శించలేమా? అనే విషయాలను అవగతం చేసుకుంటే కోపాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చెయ్యవచ్చు.
కోపం ప్రకృతి పరమయిన సహజ ఉద్వేగం. ఇది జీవుల శరీర భౌతిక ధర్మం. నేలమీద మనుగడ సాగించే ప్రతిజీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చుకొనే పుడుతుంది. జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం. ఇతర జీవులవల్ల తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు మనుగడలో (తిండి, లైంగిక అంశాలలో) పోటీ వచ్చినప్పుడు ఆ స్థితి జంతువుకు ‘సవాలు’ (Threat)గా మారుతుంది. ఈ సవాలను ఎదుర్కోవటానికి జీవులు భయాన్ని లేదా కోపాన్ని ప్రదర్శిస్తాయి.

జీవికి ఎదురయిన సవాలు పెద్దది అయినప్పుడు లేదా తన శక్తికి మించినప్పుడు భయంతో దూరంగా ‘పరారు’ (Flight) అవుతుంధి. అయితే అదే సవాలు చిన్నది అయినప్పుడు లేదా తన స్థాయికి తక్కువ అయినప్పుడు ‘దబాయింపు’ (Aggression)కు ధిగుతుంది. దబాయింపులో భాగంగా అవసరం అయితే 'పోరాటం'. (Fight) ఛేస్తుంది. ఆ విధంగా భయం, దబాయింపు అనే రెండు ప్రవర్తనల జీవులు మనుగడ కోసం రూపొందించిన ఒకే నాణానికి ఉండే రెండు వైపులు. జీవ సంబంధమైన సహజ ఉద్వేగాలు అన్నీ మానవుల్లో సమాజకీకరణ చెందుతాయి. అందులో భాగంగానే మనలో ఉండే జంతు స్వభావ ‘దబాయింపు’కు  నాగరికపు పూత పూసి ‘కోపం’గా ప్రపర్శిస్తాము.

కోపాన్నీ, భయాన్ని పుట్టించే కేంద్రం మెదడు లోపల ‘లింబిక్ లోబు’లో ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఈ రెండింటిలో ఏ ఉద్వేగం కలిగినా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయత్త పరచే అడ్రినలిను, నారడ్రినలిను హార్మోనులు విడుదల అవుతాయి. దీనివల్ల బీపీ పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్ళూ చేతులకు రక్త ప్రసరణ ఎక్కువ కావటం, ఊపిరి ఎక్కువగా తీసుకోవటం లాంటి లక్షణాలు కనపడతాయి. అలా కోపం వచ్చినా, భయం వచ్చినా శరీరంలో జరిగే మార్పులు, కనపడే లక్షణాలు ఒకేలా ఉంటాయి.
మెదడులో భయం, కోపానికి సంబంధించిన కేంద్రాలు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం రావణ కాష్టంలా మండుతూనే (Fire) ఉంటాయి. అయితే వాటిని బయటకు పొక్కనీయకుండా బలవంతంగా ‘అణచి’ (Inhibit) ఉంచే కేంద్రం కూడా ‘లింబిక్ లోబు’లోనే ఉంటుంది. ఈ కేంద్రాన్ని సడలిస్తే కోపం బయటకు వస్తుంది. ఎంత సడలింపు జరిగితే ఆ మేరకు కోపం వస్తుంది. అయితే ఈ సడలింపును అణచివేత కేంద్రం తనకు తానుగా ఇవ్వదు. మానవులలో సామాజిక ఆంశాలను పర్యవేక్షించే ‘ప్రీ ప్రాంటల్ కార్టెక్సు’ ఆదేశాలను అందుకొని దాని ప్రకారం సడలిస్తుంది.

నిత్యం మనముందు జరిగే సామాజిక సంఘటనల ఆధారంగా ‘ప్రాంటల్ కార్టెక్సు’ (వ్యవహార సౌలభ్యం కోసం దీనే్న మనసు అనుకుందాం) స్పందిస్తుంది. కోపాన్ని తెప్పించే సంఘటన జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి సడలింపు ఆదేశాలను ఇస్తుంది. మనం ‘అదిపని’గా పట్టించుకోనంత వరకూ ఈ చర్య యథాలాపంగా జరిగిపోతుంది. కానీ మనం పట్టించుకుంటే మాత్రం సడలింపు ఆదేశాలు ఇవ్వటమా, వద్దా అనేది నూటికి నూరు పాళ్ళు ‘మన’ (Will power) అదుపులోకి తీసుకోవచ్చు.

మనం సామాజిక జీవులం కాబట్టి పుట్టుకతో వచ్చే సహజ ఉద్వేగాలను అలాగే వదిలేస్తే కుదరదు. వాటిని సమాజ పరిస్థితులకు తగ్గట్టు అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపు పుట్టుకతో రాదు. ఎదిగే కొద్ది ఎవరికి వారు నేర్చుకోవాలి. దీనినే 'సామాజకీకరణ' (Socialization) అంటాము. అందులో భాగంగా సహజ ఉద్వేగం అయిన కోపాన్ని మన అదుపులో ఉంచే ‘ఓర్పు నేర్చుకోవాలి. వ్యక్తి పెరిగే వాతావరణం, పరిసరాలు, కుటుంబ కట్టుబాట్లు, చుట్టూ ఉన్న సమాజం దన్నుగా ఓర్పు రూపొందుతుంది. ఇది ఎంత బలంగా ఏర్పడితే కోపాన్ని అణచే కేంద్రానికి అంత బలం చేకూరుతుంది.

కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికో కారణం కావాలి. మన చుట్టు ఉండే వ్యక్తులు, పరిస్థితులు, సందర్భాలు కోపం రావటానికి కారణాలుగా ఉంటాయి. కారణ తీవ్రతను బట్టి విడుదల అయ్యే కోపం ఏ రూపంలో, ఎంత త్వరగా, ఎంత తీవ్రతతో ప్రదర్శించాలనే తేడాలు ఉంటాయి. సంఘటన పట్ల అవగాహన, దాన్ని అర్థం చేసుకునే తీరు, అలవర్చుకున్న ‘ఓర్పు’ తదితర అంశాలు దీన్ని నిర్ణయిస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే నిరంతరం రగులుతూ ఉండే కోపాన్ని బయటకు రానివ్వటమా, వద్దా అనేది మన మనసులో ఉన్న ‘అణచివేత-విడుదల’ బలా బలాలపై ఆధారపడి ఉంటుంది. కోపం రావటం అంటూ జరిగితే అటు పూర్తిగా జంతు ప్రవర్తన అయిన కొట్లాట నుండి ఇటు అత్యంత నాగరికమయిన సహాయ నిరాకరణ వరకూ ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఎంత తీవ్రంగా అయినా ఉండవచ్చు.

మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమయిన సహజ పరిస్థితుల (ప్రాణాపాయం, మనుగడ) కంటే సామాజిక పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం, తదితర అంశాలకు భంగం వాటిల్లినప్పుడు కోపంపై ఉన్న అణచివేత వైదొలుగుతుంది. వచ్చే కోపాన్ని వ్యక్తీకరించటంలో కూడా ఇదే వైవిధ్యం కనపడుతుంది. మిగతా జీవులు పోరాటం, పలాయనం అనే ఆదిమ పద్ధతుల్లో మాత్రమే కోపాన్ని వ్యక్తీకరిస్తాయి. మనుషులు అరవటం, తిట్టటం, అవమాన పర్చటం, చెయ్యి చేసుకోవడం, దాడి చేయడం, వస్తువులు పగలగొట్టటం లాంటిచురుకు కోపపు’ (Active Aggression) రూఫాలతో పాటు, మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగటం, సహాయ నిరాకరణ లాంటి ‘మెతక కోపపు’ (Passive Aggression) రూఫాలలో కూడా చూపుతారు.


కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమష్ఠి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు కూడా ఉంటాయి. బందులు, ధర్నాలు, పెన్నుదింపు(Pen down ) లాంటి కార్యక్రమాలు కూడా ఉమ్మడిగా కోపాన్ని ప్రదర్శించడమే. అలాగే ఒక జాతి లేదా వర్గం ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి సామూహికంగా చూపే ఉమ్మడి కోపమే సత్యాగ్రహం, విప్లవ పోరాటం, ఉగ్రవాదం లాంటి రాజకీయ పోరాట సిద్ధాంతాలు అవుతాయి.

Wednesday, December 8, 2010

సెక్సులో ధాతు పుష్టిని పెంచే మందులు!


ప్రశ్న: లైంగిక శక్తి కోసం ధాతుపుష్టి పెరగటానికి అని నాలుగువేలు పెట్టి ఏదో తైలం కొన్నాడు నా మిత్రుడు. మొదటిరోజు కొంతపని చేసిందట. ఆ తరువాత ఉపయోగం లేదని అంటున్నాడు. అసలు ధాతుపుష్టి పెరగడానికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎక్కడ దొరుకుతాయి                                        - కె. కృపాకర్, ఏలూరు
మాధానం:  మీ మిత్రుడు లాంటి వారు ఉన్నంత కాలం అలాంటి ధాతుపుష్టి మందులు దొరుకుతూనే ఉంటాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అధునాతన మెడికలు షాపుల నుండి నాటు మందులు అమ్మే దుకాణాలలో ఎక్కడయినా దొరుకుతాయి. ఇక అవి పనిచేయటం అంటారా? అద్భుతంగా పనిచేస్తాయి. కాకుంటే మీ మిత్రుడులాంటి వారి ధాతుపుష్టికి కాదు. అమ్మినవాడి ఆర్థిక పుష్టికి. 
     లైంగికతలో మనసు, శరీరం సమన్వయంతో పని చేయాలి. ఈ రెంటిలో లోపంలేకుండా ఉంటే మనిషిలో పుట్టే ‘ఆలోచనే’ లైంగిక ధాతువుగా పనిచేస్తుంది. శరీరం బాగుండి మనసు ఒత్తిడి, దిగులు, అలజడి, సైకొసిసులాంటి ఇబ్బందుల్లో ఉన్నా, మనసు బాగుండి శరీరంలో (హార్మోనులు, నరాలు, రక్తనాళాలలో) లోపం ఉన్నా లైంగిక ఇబ్బందులు వస్తాయి. అందుకు కారణాలను గుర్తించి వాటిని సరిచేస్తే సమస్య తీరుతుంది. ఎవరు ఏది చెబితే వాటిని గుడ్డిగా అనుసరిస్తే నష్టపోక తప్పదు. లైంగికతను పెంచే ధాతువులు ఏమీ లేవు. ప్రస్తుతం లేపుడు మాత్రంగా వాడే ‘సిల్డెనాఫిల్’ కూడా అంగంలో మూసుకుపోయిన నెత్తురు గొట్టాలను తాత్కాలికంగా వెడల్పు చేసి అప్పటికప్పుడు పని జరిగేట్టు ఉపయోగపడతాయి.
ప్రశ్న: మా అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. మూడేళ్ళ ముందు వరకూ చదువుల్లో బాగా ఉండేది. చలాకీగా అందరితో కలుపుగోలుగా ఉండేది. పాప ప్రవర్తన రాను రానూ ఘోరంగా తయారౌతోంది. ఎవరినీ కలవటానికి ఇష్టపడటం లేదు. తనకు తానుగా ఏ పనీ చేయదు. ప్రతీ పనికీ నెట్టాల్సిందే. అరచి గోల చేస్తే కదులుతుంది. బలవంతంగా చేయించానా నిదానంగా చేస్తుంది. పని చేస్తూ అలాగే కూర్చొండి పోతుంది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. స్నానం గంటలకొద్ది చేస్తుంది. ఎప్పుడూ తనలో తానే ఏదో ఆలోచించుకుంటున్నట్లు ఉంటుంది. నేరుగా మనవైపు చూసి మాట్లాడదు. అప్పుడప్పుడూ తనలోతానే మాట్లాడుకోవటం, నవ్వుకోవటం చేస్తుంది. కాలేజీ చదువు దాదాపు మానేసినట్టే. చెప్పీ, చెప్పీ మాకు విసుగు వస్తోంది. ఆసుపత్రికి రమ్మంటే రాదు. నేను బాగానే ఉన్నాను. రాను అంటుంది. మా బంధువులు యోగా, మెడిటేషన్ చేయిస్తే తగ్గుతుందని చెబుతున్నారు. అలా చేయించడానికి కూడా వీలు కావటం లేదు. ఏమీ చేయాలో తోచటం లేదు.                                         - ఈ మెయిలు ద్వారా ఓ తండ్రి

సమాధానం: మీరు రాసిన లక్షణాలను బట్టి మీ అమ్మాయికి ‘కెటటానిక్ స్కిజో ఫ్రెనియా’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనిషికి వచ్చే మానసిక వ్యాధుల్లో ఇది తీవ్రమయిన దానికందే లెక్క. ఈ జబ్బు మొదలయినప్పటి నుండి చాపకింద నీరులా తెలియకుండానే ముదురు దశకు వస్తుంది. జబ్బు పెరిగే కొద్ది వ్యక్తిత్వాన్ని (Personality), గుర్తింపు(Identity)ని దెబ్బతీస్తుంది. సమాజంలో భాగంగా ఉండాల్సిన వారు సమాజంతో సంబంధం లేకుండా వారిదయిన ప్రపంచంలో బతుకుతారు. దీనివల్ల, విద్యా, ఉపాధి, వైవాహిక తదితర మానవ సంబంధాలలో వారి పాత్రను పోషించలేరు. జబ్బు తీవ్రత పెరిగే కొద్ది జీవచ్ఛంలా మారిపోతారు. మీ అమ్మాయి విషయంలో ఇప్పటికే కొంత ఆలస్యం జరిగింది. త్వరగా మానసిక వైద్యుల దగ్గర వైద్యం చేయించండి. మందులు వాడటం తప్పనిసరి. మీరు చేయించే వైద్యాన్ని బట్టి మూడు, నాలుగు నెలల్లో కొంత మెరుగు కనిపిస్తుంది. మెరుగు అయింది కదా అని మందులు ఆపకూడదు. సుమారు రెండేళ్ళపాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ జబ్బుకు  యోగా, మెడిటేషన్ లాంటి ప్రక్రియలు కాలయాపనకు తప్ప పనికిరావు. మొదట మందులు వాడటం ఒక్కటే పరిష్కారం. ఆ తరువాత ఆమెను సమాజంలో కలపటానికీ, జబ్బు పెరగకుండా ఉండటానికి పునరావాస చికిత్స అవసరం అవుతుంది. అవన్నీ వైద్యం చేసే డాక్టరు చూసుకుంటారు.

ప్రశ్న: మా అబ్బాయి టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. టెన్త్ ఇంట్లో ఉండే చదివాడు. ఇప్పుడు ఇంటర్ ఫస్టియిర్ బైపీసీ శ్రీ చైతన్యలో చేర్పించాము. చేరినప్పటి నుండి వాడికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. తరచూ తలనొప్పి వస్తుంది. చదవాలంటే ఏకాగ్రత కుదరటం లేదని చెబుతున్నాడు. క్లాసులో తూగు  వస్తుందని, పాఠాలు అర్థం కావటం లేదని అంటున్నాడు. ఈ రెండేళ్ళూ ఎలాగో కష్టపడి చదివి ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకోమని నచ్చజెప్పాము. ఇప్పుడు అసలు నేను చదవనే చదవనని మొండికేస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తానని ఒకటే గొడవ. వాడిని డాక్టర్‌ని చేయాలని మా కోరిక. కౌన్సిలింగు ఇప్పిస్తే ఉపయోగం ఉంటుందా?                                               - వి. రమణారెడ్డి, మదనపల్లె

సమాధానం: కౌన్సిలింగు తప్పకుండా ఉపయోగపడుతుంది,కాకుంటే కౌన్సిలింగు చెయ్యాల్సిందే. పిల్లవాడికి కాదు. ప్రధానంగా తల్లిదండ్రులకు. పిల్లల చదువులో వారి శక్తి సామర్థ్యాలు చదువుపట్ల వారికి ఉండే ఆసక్తి, తగిన వాతావరణం ఈ మూడు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మూడు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు సమకూర్చే వనరులు (మరో మాటలో డబ్బు) అదనపు పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పటి చదువుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కేవలం డబ్బు ఉంది కాబట్టి కార్పొరేటు సంస్థల్లో చేర్పిస్తే ఇవి రావు. ఇప్పటి కాలంలో పదో తరగతిలో మంచి మార్కులు వచ్చినంత మాత్రాన పిల్లవాడికి నిజంగా సామర్థ్యం ఉండాలన్న రూలేం లేదు. కారణం ఏమిటంటే దాదాపు కార్పొరేటు బడులన్నీ పిల్లల మానసిక సామర్థ్యాన్ని పట్టించుకోకుండా కేవలం వారిలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించి మార్కుల రూపంలోకి మారుస్తున్నాయి. దీనివల్ల నిజంగా సామర్థ్యం ఉన్న పిల్లలకు పోయేది ఏమీ లేదు కానీ లేని పిల్లలు ఉన్నత చదువులకు పోయేకొద్ది చదువు భారంగా మారి మానసిక సమస్యలు తలెత్తుతాయి. మీ అబ్బాయికి పై చదువుకి సామర్థ్యం ఎంత ఉందనేది మంచి క్లినికల్ సైకాలజిస్టు దగ్గర అంచనా వేయించండి. అలాగే పిల్లవాడికి మీరు చదివించదలచుకున్న చదువుపై ఆసక్తి ఉందో లేదో కనుక్కోండి. ఈ రెండింటిలో ఇబ్బంది లేకపోతే చదువు వాతావరణం కారణం అయి ఉంటుంది.
         దాదాపు కార్పొరేటు విద్యా సంస్థలన్నింటిలో పిల్లలకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఈ సంస్థలు పిల్లల మానసిక, శారీరక ఉల్లాసానికి దాదాపు సమాధి కడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల నిద్రను దారుణంగా దోపిడీ చేస్తాయి. మీ అబ్బాయి వయసుకు రోజుకు తొమ్మిది గంటల నిద్ర కావాలి. కానీ కార్పొరేటు కాలేజీలలో పిల్లల్ని నిద్ర పోనిచ్చేది కేవలం 5 లేదా 6 గంటలే. తగ్గిన ఆ మూడు గంటల నిద్రవల్ల కూడా మీ అబ్బాయికి మీరు చెప్పిన లక్షణాలు రావొచ్చు. మీ అబ్బాయిని ఒకసారి క్లినికల్ సైకాలజిస్టు దగ్గర చూపించి, వారి సలహా పాటించండి.


ఇవి 8 - 12 - 2010 ఆంధ్రభూమి దిన పత్రికలో ఇచ్చిన "సందేహాలు - సమాధానాలు" మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా dr.teja @ymail.com  


Wednesday, December 1, 2010

కొలెస్టరాలుతో కొందరికే చిక్కు

ప్రసాద రావుకి 40 నిండాయి. ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్యమూ లేదు. పత్రికలలో ఆరోగ్య శీర్షికలు చదవటం అలవాటు. ‘‘40 దాటాక ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది’’ అనే విషయం ఎక్కడ చదివాడో కానీ బుర్రలోకి దూరింది. ఒక డాక్టర్ని కలిసి, ఓ అయిదు వేలు ఖర్చు పెట్టి మొత్తం పరీక్షలు చేయించు కున్నాడు. అదృష్టవశాత్తు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రక్తంలో పిసరంత కొలెస్టరాలు ఎక్కువగా ఉందని తేలింది. అసలే ఆనంద రావుకి ఆరోగ్యం పట్ల కాస్త జాగర్త ఎక్కువ. పైగా పత్రికలలో ఆరోగ్య శీర్షికలు చదివే అలవాటు. దీనికి తోడు పరీక్షలు చేయించిన డాక్టరు కాస్త ‘కొలెస్టరాలు’ ఉండే ఆహారం తగ్గించమని చెవిలో వేశాడు. ఇంకేముందీ! ఆగమేఘాల మీద ఏయే పదార్థాలలో కొలెస్టరాలు ఉంటుందో లిస్టు సేకరించటం మొదలయింది. టీవీ ప్రకటనల్లో ‘మా కంపెనీ నూనెలో జీరో కొలెస్టరాలు’’ అన్న బ్రాండుల నూనెని మాత్రమే కొనుమని భార్యకు హుకుం జారీ చేశాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ప్రసాద రావుకి కొలెస్టరాలు ఫోబియా పట్టుకుంది.
            *************************************************                                  *************************

ప్రసాద రావుది కాస్త అతిశయోక్తి ‘స్టోరీ’ అనుకున్నా ఆరోగ్యం పట్ల అంతో ఇంతో శ్రద్ధ తీసు కునే వారిలో పత్రికలలో ఆరోగ్య శీర్షికలు చదివే వారిలో, ‘సరుకు’ లేకుండా పత్రికల్లో శీర్షికలు రాసే వారిలో (అందులో డాక్టర్లు, తిండి నిపుణులు కూడా ఉండ వచ్చు) కొలెస్టరాలు వ్యవహారం ఓ పెద్ద భూతంలా పరిగణిస్తారు. నిజానికి కొలెస్టరాలు గురించి పూర్తిగా తెలుసు కుంటే దానికి అంత ‘సీను’ లేదని తేట తెల్లమవుతుంది.

కొలెస్టరాలు మన శరీరంలో చాలా ముఖ్యమయిన కీలక జీవన క్రియలను పోషిస్తోంది. పైత్య రసం తయారు కావటానికీ, వైటమిను-డి తయారీకి, మరికొన్ని హార్మోనులు (ప్రాజెస్టరాను, గ్లూకో కార్డికాయిడు, అండ్రోజను, ఈస్ట్రోజను, మినరలో కార్టికాయడు) తయారు కావటానికి కొలెస్టరాలు కావాలి. వాటి తయారీలో ఇది ముడి సరుకుగా ఉపయోగ పడుతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్నా ఈ కొలెస్టరాలు శరీరానికి రెండు రకాలుగా అందుతుంది.
శరీరానికి అవసరమయిన కొలెస్టరాలులో దాదాపు మూడో వంతు శరీరం తయారు చేసు కోగా మిగిలిన పావు వంతు తిండి ద్వారా అందుతుంది. అయితే ఇందులో మరో వెసులుబాటు కూడా ఉంటుంది. మన ఆహారంలో అసలు కొలెస్టరాలే లేక పోతే అవసరమయిన మొత్తాన్ని శరీరమే దానంత అదే తయారు చేసుకుంటుంది. మన తిండిలో ఎక్కువ కొలెస్టరాలు ఉంటే ఆ మేరకు శరీరం తన తయారీని తగ్గించు కుంటుంది. కాబట్టి మనం తిన్నా, తినక పోయినా దాని అదుపులో అది ఉంటుంది. అంటే కొలెస్టరాలు ‘సొంత అదుపు’ (Auto regulation) మన శరీరం లోనే ఉంటుంధి. కాబట్టి సాధారణ జనం కొలెస్టరాలును అదుపులో ఉంచు కొనే నియమాలేవీ పాటించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆరోగ్యం  పట్ల అదనపు జాగర్త తీసు కోవాలన్న నెపంతో ‘అది తింటే కొలెస్టరాలు, ఇది తింటే కొలెస్టరాలు’ అని అతి జాగర్తలకు పోతారు. అలాంటివేమీ అవసరం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ జనం అన్నీ హాయిగా తిన వచ్చు.

అయితే పైన చెప్పిన నీతులు చాలా కొద్ది మందికి వర్తించవు. వీరిలో కొలెస్టరాలను అదుపులో ఉంచే ‘మర’లో లోపం రావటం వల్ల శరీరంలో కొలెస్టరాలు నిలువలు ఎక్కువగా పేరుకు పోతాయి. రక్తంలో '‘ఉండాల్సినంత కొలెస్టరాలు ఉంది. ఇక మీ తయారీని ఆపండి’' అని కొలెస్టరాలును తయారు చేసే అవయవాల చెవిన వేసే ఎంజైములు లోపించటం వల్ల వాటికి తిరుగు సమాచారం (Feed back) లేక అవి తయారు చేస్తూనే ఉంటాయి. 

మరి కొందరిలో కొలెస్టరాలును వివిధ అవసరాలకు మళ్ళించాల్సిన ఎంజయములు పుట్టుక తోనే లోపించటం వల్ల అది ఖర్చు కాకుండా నిలువలుగా పేరుకు పోతాయి. సాధారణంగా ఈ రెండు లోపాలు వంశపారంపర్యంగా వస్తాయి.

గుండె జబ్బు, పక్షవాతం లాంటి అనేక జబ్బులు రావటానికి ‘రక్త నాళాలు గట్టి పడటం’ (Atherosclerosis) ఒక ప్రధాన కారణం. రక్త నాళాలు గట్టి పడటానికి బీపీ, షుగరు, ఊబకాయం, సోమరి జీవితం, వ్యాయామం లేక పోవటం, మానసిక ఒత్తిడి, పొగ తాగటం అనే ‘పాలయ్యే కారణాలు (Risk factors) ఉండే వారికి ఎక్కువగా జరుగుతుంది. వీటిలో విడివిడిగా దేనికి అదే పాలుబడే కారణంగా పని చేస్తాయి. వ్యక్తిలో పాలయ్యే కారణాలు  పెరిగే కొద్ది ఎక్కువగా ఉన్న కొలెస్టరాలు కూడా రక్త నాళాలు గట్టి పడ టానికి ఉడుత సాయం చేస్తుంది. కొలెస్టరాలు నిలువలు మరీ ఎక్కువ అయినప్పుడు అవి రక్తం లోనే కాకుండా శరీరంలో అక్కడక్కడా పేరుకు పోతాయి.

కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మామూలు వ్యక్తులు కేవలం కొలెస్టరాలు పెరుగుతుందనే నెపంతో తినాల్సిన వాటిని త్యాగించాల్సిన అవసరం లేదు. వారసత్వపు కొలెస్టరాలు జబ్బు ఉండే వారిని మినహాయిస్తే సాధారణ జనానికి కొలెస్టరాలు పెరిగే అవకాశం లేదు. ఎప్పుడయినా ఒకసారి రక్తంలో కొలెస్టరాలు ఎక్కువ అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. సాధారణంగా అది తప్పుడు రిపోర్టు అయి ఉంటుంది. అనుమానం వస్తే తూకం బాగుండే (Standard Lab) దగ్గర ఒకటికి రెండు సార్లు పరీక్ష చేయించండి.

ఎప్పుడూ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కొలెస్టరాలు ఉన్నప్పుడు కూడా దానికి మందులు వాడటం మంచిది కాదు. దాన్ని తగ్గించ టానికి కూడా ఒక జీవన సరళి ఉంది. అలాంటి జీవన సరళి పాటించాక కూడా అదుపు లోకి రాక పోతే, రక్త నాళాలు గట్టి పడ టానికి మిగిలిన పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, మలి ప్రయత్నంలో భాగం గానే మందులు వాడాలి. అధికంగా కొలెస్టరాలు ఉన్న వారు దాన్ని తగ్గించు కోవటానికి మార్చు కోవాల్సిన జీవన సరళి ఇలా ఉండాలి.
  • పైత్య రసం తయారీకి అధిక మొత్తంలో కొలెస్టరాలు కావాలి. ఎంత ఎక్కువ పైత్యరసం తయారయితే అంత ఎక్కువగా కొలెస్టరాలు ఖర్చు అయిపోతుంది. పీచు పదార్థాలు ఎంత ఎక్కువగా తింటే, అంత ఎక్కువ పైత్యరసం తయారవుతుంది. మల్ల బద్దకం తగ్గటం, బరువు తగ్గటం, ఇందులో మీరు వద్దనుకున్నా వచ్చే అదనపు బహుమతి.
  • వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కొలెస్టరాలు తగ్గుతుంది. బీపీ తగ్గటం, షుగరు అదుపులో ఉండటం, బరువు తగ్గటం, చలాకీగా ఉండటం అదనపు ప్రయోజనాలు.
  • ఎవరికయినా తినే తిండి మొత్తంలో కొవ్వు లేదా నూనెలు 30 శాతం ఉండాలి. అంతకు మించి ఎంత ఎక్కువ కొవ్వు లేదా నూనెల వాడకం పెరిగితే అంత ఎక్కువగా కొలెస్టరాలు పెరుగుతుంది. లావు కావటం వద్దనుకున్నా వచ్చే అదనపు నష్టం.
  • ఊబకాయం, సోమరితనం, చక్కెర జబ్బు కొలెస్టరాలును పెంచుతాయి. వాటిని తరిమిస్తే కొలెస్టరాలు కూడా పరారు అవుతుంది.
  • ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా కొలెస్టరాలును తగ్గిస్తాయి. వీటిని వాడటం వల్ల నష్టం అయితే ఏమీ లేదు.
  • కొలెస్టరాలు తగ్గ టానికి వాడే మందులు అన్నీ చాలా చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. జీవన సరళిని మార్చటం ద్వారా కూడా అదుపులో లేక పోతే అప్పుడు మాత్రమే డాక్టర్లు మందులు రాయాలి. రోగులు వేసు కోవాలి.  ఈ సంగతి ఎప్పుడూ గుర్తుంచు కోండి.


Wednesday, November 10, 2010

కండ కదిలితే "షుగరు" కరుగుతుంది

52 ఏళ్ళ ఆనంద రావు బ్యాంకులో క్లర్క్. కూర్చోని చేసే ఉద్యోగం. బ్యాంకు దగ్గర బండి కిక్కు కొడితే ఇంటి ముందు తేలుతాడు. ఎక్కడికి పోవాలన్నా బైకు మీదే. అలాంటి ఆనంద రావు శరీరంలో పదేళ్ళ నుండి బీపీ, ఆరేళ్ళ నుండి షుగరు సహజీవనం చేస్తున్నాయి. రెండు నెలలకు ఒకసారి డాక్టర్ని కలుస్తాడు. క్రమం తప్పకుండా మందులు వాడుతాడు. డాక్టరు సలహా ప్రకారం తిండిలో ఉప్పు అయితే తగ్గించాడు కానీ తిండిని తగ్గించలేక పోతున్నాడు. తరచూ తిండి ఎక్కువ అవుతుంది. ఆనందం రావు కాస్త తెలివికలవాడు కూడా. పైగా రోగం పట్ల కొత్త డాక్టరు కంటే పాత రోగికి అవగాహన ఎక్కువ అన్న సూక్తిని బాగా ఎరిగిన వాడు. నాలుకను అదుపు చేసుకోలేని ప్రతిసారీ షుగరు పెరగకుండా తిన్న తిండిని బట్టి ఒకటీ, రెండు మాత్రలను అదనంగా వేసుకుంటాడు. ఇలా తన షుగరు పెరగకుండా తనే అదుపు చేసుకుంటున్నానని అనుకుంటాడు. అనుకోవటమే కాదు. షుగరు ఉన్నవారు మితంగా తినబోతుంటే ‘‘అప్పుడప్పుడు ఎక్కువయినా ఏం పరవాలేదులెండి! ఈ రోజుకు కాస్త తినండి. ఓ అర మాత్ర అదనంగా వేసుకుంటే సరిపోతుంది’’ అని సలహా ఇస్తాడు తను కూడా అదే పాటిస్తున్నానని ఎదుటివారికి భరోసా ఇస్తాడు.
                      ***************************************************

ఎక్కడో కొద్ది మంది తప్ప చక్కెర జబ్బు ఉన్న చాలా మంది చాలా సందర్భాలలో ఆనందం రావు లాగే ప్రవర్తిస్తారు. వీరి ఉద్దేశం ఏమిటంటే మాత్ర వేసుకున్నందు వల్ల ఒంట్లో చక్కెర తగ్గుతుందని. ఇందులో నిజం ఎంత?

తిని మాత్ర వేసుకునప్పుడు రక్తంలో ఉన్న గ్లూకోజ్ ‘తగ్గు’తుందే కాని అది ‘మాయం’ కాదు. ఒక దగ్గర తగ్గిందంటే అది మర్కెడికో వెళ్ళి ఉంటుంది. మాత్ర లేదా ఇన్సులిను అదనంగా వేసుకున్నందు వల్ల గ్లూకోజ్ తన రూపం మార్చుకుంటుందే తప్ప శరీరంలో నుంచి బయటకు పోదన్న సంగతి తెలుసుకుంటే చక్కెర జబ్బును అదుపులో ఉంచుకోవటం సగం విజయం సాధిచినట్టే.

తిన్న తిండి నుండి తయారు అయిన గ్లూకోజు శరీరానికి శక్తిని ఇవ్వటానికి ఉపయోగ పడుతుంది. గ్లూకోజ్ శక్తిగా ఎలా మారుతుందంటే --
  1. గ్లూకోజు ఆక్సిజనుతో కలిసి మండటం (జీవ పరమైన మంట) వల్ల శక్తి విడుదల అవుతుంది.
  2. ఎంత ఎక్కువ శక్తి కావాలంటే అంత ఎక్కువ గ్లూకోజ్ మండాలి.
  3. ఎక్కువ గ్లూకోజ్ మండాలంటే ఎక్కువ ఆక్సిజను కావాలి.
  4. ఎంత ఆక్సిజను కావాలంటే అంతగా లోపలికి గాలి పీల్చాలి.
  5. ఎంత ఎక్కువ గ్లూకోజ్ మండితే అంత ఎక్కువ ‘బొగ్గు పులుసు గాలి’ తయారవుతుంది.
  6. ఎంత ఎక్కువ గ్లూకోజ్ మండితే అంతగా శరీరం వేడెక్కుతుంది. ఆ వేడిని తగ్గించటానికి చెమట పడుతుంది.
  7. ఎంత బొగ్గు పులుసు గాలిని బయటకు పంపాలంటే ఎంత ఎక్కువగా గాలి వదలాలి.
 ఈ కారణాల వల్లే కష్టం చేసేటప్పుడు ఆక్సిజన్‌ని లోపలకు పీల్చటం కోసం, బొగ్గు పులుసు గాలిని బయటకు వదలటం కోసం ఎక్కువగా రొప్పుతాం. అలాగే శరీరాన్ని చల్లబర్చటం కోసం చెమట ఎక్కువగా పడుతుంది. చేసే కష్టం ఎంత ఎక్కువగా ఉంటే వీటి జోరు అంత ఎక్కువగా ఉంటుంది. వీటి జోరు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా శరీరంలో ఉన్న గ్లూకోజు తగలబడి ఖర్చు అయిపోతుందని అర్థం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇన్సులిను లేదా మాత్రలు వాడినప్పుడు అవి చేసే పనేంటంటే రక్తంలో ఉన్న గ్లూకోజును అక్కడ ఉండనీయకుండా కణాలలోకి తోసిపారేస్తాయి. మామూలుగా అయితే కణాలకు చేరిన గ్లూకోజు శరీరం చేసే శ్రమను బట్టి మండి శక్తిగా మారాలి. అందుకు అవకాశం లేనప్పుడు అదంతా కొవ్వుగా మారుతుంది.
ఎక్కువ తిని మాత్ర వేసుకున్నందువల్ల కణాలలోకి అదనంగా చేరిన గ్లూకోజు శ్రమ లేనప్పుడు అంతా కొవ్వుగా మారిపోతుంది. అంటే రూపం మార్చుకుంటుంది. ఇలా జరిగే కొద్ది శరీరంలో కొవ్వు నిలువలు పేరుకుపోయి లావు అవుతారు. లావు కావటం చక్కెర వ్యాధికి మరో ఇబ్బందికరమైన అంశం.

కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్థులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తిని గమ్మున కూర్చోని మందులు వేసుకుంటే కొవ్వు పెరుగుతుంది. అలా కాకుండా తిని శ్రమ చేస్తే కణాలకు గ్లూకోజు డిమాండు ఎక్కువ అయి ఉన్న గ్లూకోజును లాక్కొని ఉపయోగించుకుంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర పెరగకుండా అదుపులో ఉంటుంది.

వ్యాయామంతో మరికొన్ని ఉపయోగాలు ఏమిటంటే శరీరంలో అదనంగా ఉన్న కొలెస్టరాలును తగ్గిస్తుంది. శరీర అవయవాలకు ముఖ్యంగా కాళ్ళూ, చేతులుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. షుగరు వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా సమస్యలు తలెత్తేది ఈ భాగాలలోనే ఈ భాగాలకు రక్త సరఫరా ఎంత ఎక్కువగా ఉంటే చక్కెర జబ్బువల్ల జరిగే నష్టాలు అంత తక్కువగా ఉంటాయి. వ్యాయామం కొంత మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పరోక్షంగా (ఒత్తిడి ఎక్కువగా ఉంటే గ్లూకోజు పెరిగి పోతుంది) రక్తంలో గ్లూకోజును తగ్గిస్తుంది. వ్యాయామం మధుమేహాన్ని అదుపులో ఉంచటమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. దాంతో గుండె జబ్బులు, పక్షవాతం లాంటి జబ్బులు దూరంగా జరుగుతాయి. చక్కెర జబ్బు ఉన్నవారు ఆహారం అదుపుతో పాటు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మధుమేహం ఉన్నవారు సాధారణంగా అందరూ పాటించే వ్యాయామానికి కాస్త భిన్నంగా, కొన్ని జాగ్రత్తలతో చేయాలి. వాటిలో ముఖ్యమైనవి ఇవి.
  • రోజుకు కనీసం అరగంట నుండి గంటపాటు ఒక మోస్తారు ‘నడక, ఎరోబిక్సు) నుండి శరీరం సహకరిస్తే భారీ (షటిలు, టెన్నీసు, స్విమ్మింగ్) వ్యాయామం వరకూ చేసుకోవచ్చు. చేయటం మాత్రం తప్పనిసరి.
  • భారీ వ్యాయామం చేయాలనుకునేవారు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి మీ శరీరం ఏ మేరకు వ్యాయామాన్ని తట్టుకోగలదో అంచనా వేయించుకొని దాని ప్రకారం చేయాలి.
  • చేసే వ్యాయామం కనీసం వారానికి 4, 5 రోజులకు తక్కువ కాకుండా ఉండాలి.
  • కొత్తగా వ్యాయామం మొదలు పెట్టే వారు బూట్లు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. సాక్సు తప్పనిసరిగా వాడాలి లేదంటే బొబ్బలు లేచే అవకాశం ఉంటుంది.
  • వ్యాయామం చేయబోయే ముందు ఓ అయిదు నిమిషాలు ఒంటిని 'ఉడుకు' (వార్మ్ అప్) పరచాలి.
  • నటవటానికి కాళ్ళు సహకరించనప్పుడు ఈత మంచి వ్యాయామం.
  • ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఒకే వేళకు వ్యాయామం చేయటం మంచిది.
  • షుగరు మాత్రలు, ఇన్సులిను తీసుకొని వ్యాయామం చేయకూడదు. అలాగే ఏమీ తినకుండా వ్యాయామం చేయకూడదు. అలా చేస్తే రక్తంలో గ్లూకోజు తగ్గిపోయి ‘హైపోగ్లయిసేమియా’ అనే స్థితి వచ్చి ఇబ్బంది పడిపోతారు.
  • తిన్న రెండు గంటల తరువాత వ్యాయామం చేయటం ఉత్తమం.
  • ఇది కాక రోజువారీ వ్యవహారంలో నడకను ఎక్కువగా ఉపయోగించాలి.
  • మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్నప్పుడు మెట్లు ఉపయోగించటం మంచిది.
  • వ్యాయామం చేయటానికి వీలు కాని వారు అవసరం మేరకు, తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం ద్వారా ఉన్నంతలో జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు
ఆరోగ్యం, వైద్యం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రవర్తనకు సంబంధించిన అంశాలలో మీకు సందేహాలుంటే అడగవచ్చు. ప్రతి బుధవారం ఆంద్రభూమి దిన పత్ర్హిక "సంజీవని"లో సమాధానాలు ఇస్తాను.  వ్యక్తిగతంగా, ఉత్తరాల ద్వారా, ఈ -మెయిల్ ద్వారా సమాధానాలు ఇవ్వటం కుదరదు. దయచేసి మన్నించండి 

చిరునామా: 
డా. పి. శ్రీనివాస తేజ, సైకియాట్రిస్టు, బ్రైన్ వేవ్ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు - 524001

Wednesday, November 3, 2010

బాగా తినండి, మధుమేహం తగ్గించుకోండి


సున్నిత మనసు, జాలిగుండె ఉన్న వ్యక్తులు పోలీసులుగా రాణించలేరు. అలాగే జాలి గుండె లేకుండా కఠినంగా వ్యవహరించే వారు వైద్యులుగా పనికిరారు. తిమ్మిని బమ్మిగా చేయలేని వారు లాయర్లుగా చలామణి కారు. వృత్తిలోకి ప్రవేవించక ముందు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు కానీ, ఆయా పనుల్లో కుదురుకున్నాక పాత ప్రవర్తనను పక్కన పెట్టి వృత్తికి సరిపోయిన ప్రవర్తనని అలవరుచుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈ సూత్రం వృత్తులకే కాదు జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఆరోగ్యం ఉన్నంత వరకూ ఎన్ని ఆటలు ఆడినా, ఎంత విచ్చల విడిగా ప్రవర్తించినా చెల్లుతుంది. కానీ జబ్బున పడ్డాక అది తగ్గటానికీ, లేదా అదుపులో ఉంచడానికి ‘అనుకూల ప్రవర్తన’ను అలవరచుకోకుండా కేవలం మందులతోనే వైద్యం చేయించుకుంటే ఉపయోగం ఉండదు. రోగం వచ్చాక ఖచ్చితంగా ప్రవర్తన మార్చుకోవాల్సిన జబ్బుల్లో చక్కెర వ్యాధి లేదా మధుమేహం ఒకటి.


                 ***************************************************

చక్కర జబ్బు రావటమే తప్ప నయం కావటం ఉండదు. జీవితాంతం వ్యక్తితో సహా జీవనం చేస్తుంది. కాబట్టి జబ్బు కనపడ్డప్పటి నుండి జీవితాంతం దాన్ని పట్టించుకోవాలి. పట్టించుకోవాలంటే దాన్ని గురించి తెలుసుకోవాలి.
    మనం తినే తిండిలో ప్రధానంగా ఒంటికి చేరేవి పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీనులు), నూనె పదార్థాలు (లిపిడ్లు), మిగిలినదంతా పీచు (ఫైబరు). తినే తిండిలో ఉన్న ‘పిండి పదార్థాలు’ అరిగి చివరికి గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఇది శరీరంలో ఉన్న ప్రతీ కణానికి చేరి శక్తి పుట్టటానికి కావల్సిన సరుకుగా ఉపయోగపడుతుంది. శరీరంలో తయారయ్యే గ్లూకోజు శరీర అవసరాలకు పోను మిగిలినది గ్లయికోజనుగా, కొవ్వుగా మారి నిలువ ఉంటుంది. శరీర అవసరాలకు శరీరంలో 100 మిల్లీ లీటర్ల రక్తంలో 80 నుండి గరిష్టంగా 180 మిల్లీ గ్రాముల గ్లూకోజు ఉండాలి. అంతకు మించి ఉంటే దాన్ని ఇతర రూపంలోకి మార్చి రక్తంలో గ్లూకోజును తగ్గించే పనిని ‘ఇన్సులిను’ అనే హార్మోను చేస్తుంది. ఏ కారణం వల్లనైనా శరీరంలో ఇన్సులిను ఊరటం తగ్గినా లేదా ఇన్సులిను ఉనా దానికి కణాలు స్పందించక పోయినా రక్తంలో గ్లూకోజు నిలువలు పేరుకుపోతాయి. అలా పేరుకు పోయిన నిలువలు శరీరంలో దాదాపు అన్ని భాగాలను పాడు చేస్తుంది. ముఖ్యంగా కళ్లు, నరాలు, గుండె, కిడ్నీలు పాడవుతాయి.
    మధుమేహం వచ్చాక రక్తంలో గ్లూకోజు స్థాయిని శరీరం దానంతట అది అదుపు చేసుకోలేదు కాబట్టి బైట నుండి మనమే అదుపు చేయాలి. అలా అదుపు చేయాలంటే మధుమేహానికి తగ్గట్టు జీవన విధానాన్ని మార్చుకోవాలి. అదే ‘డయాబెటిక్ జీవన విధానం’. ఇందులో మందుల వాడకం ద్వారా చక్కెరను అదుపులో పెట్టుకోవటం కేవలం పావలా వంతే. వాటి సంగతి డాక్టర్లు చూసుకుంటారు. మిగిలిన ముప్పాయి భాగం ప్రవర్తనను మార్చుకోవటం ద్వారా అదుపులో ఉంచుకోవాలి. అంటే జీవన శైలిని మార్చుకోవాలి. చక్కెర జబ్బు వచ్చినప్పుడు మార్చుకోవాల్సిన జీవన శైలి మూడు మూల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
  • అదనపు కేలరీలను శరీరంలోకి పోకుండా ‘తిండి’ మీద అదుపు.
  • తిన్న తిండి నిలువలుగా పేరుకు పోకుండా ‘శ్రమ’ చేయటం ద్వారా ఖర్చు చేయటం.
  • అప్పటికీ అదుపు కాకపోతే చివరి ప్రయత్నంగా ‘మందులు’ వాడుకోవటం.
     తిండి విషయానికి వస్తే ఎప్పుడు తినాలి? ఎంత తినాలా? ఏమి తినాలి? ఎలా తినాలి? అనేది తెలుసుకొని ఉండాలి. తెలుసుకుంటే సరిపోదు. దాని ప్రకారం నడుచుకోవాలి.
    చక్కెర వ్యాధిగ్రస్తులు అందరిలాగా మూడు పూట్లా తింటే కుదరదు. తినటం ద్వారా శరీరంలోకి చేరిన గ్లూకోజును తొలగించే ఇన్సులిను తగినంతగా లేనందువల్ల తీవ్రతను బట్టి గ్లూకోజు నిలువలు పేరుకు పోతాయి. అలా పేరుకుపోకుండా కావల్సిన మేరకు ఉండాలంటే శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. గతంలో మాదిరి ఎంతంటే అంత తినటానికి లేదు. తినే తిండి నాలుగు గంటలకు సరిపోయేతంగా ఉండాలి. తిన్నది అయిపోయే లోపల మళ్లీ తినాలి. ఇలా ప్రతి నాలుగు గంటల వ్యవధిలో తింటూ ఉండాలి. దీనినే మరో మాటలో చెప్పాలంటే మామూలుగా తినే తిండినే కొద్ది కొద్దిగా విభజించుకొని ఎక్కువ సార్లు తినాలి. అలా చూసినప్పుడు చక్కెర వ్యాధిగ్రస్తులు ఈ విధంగా తినాలి
  • పొద్దున 6 గంటలకు - కాఫీ, స్నాక్సు 
  • పొద్దెక్కి 10 గంటలకు - టిఫిను
  • మధ్యాహ్నం 2 గంటలకు -  భోజనం (లంచ్)
  • సాయంత్రం 6 గంటలకు - స్నాక్సు  లేదా టిఫను  
  • రాత్రి 10 గంటలకు - భోజనం (డిన్నర్)
    రాత్రి 10 నుండి తెల్లవారి 6 గంటల వరకూ అంటే నిద్రకు కేటాయించిన 8 గంటల సమయంలో మధ్యలో 12 గంటలకు లేచి తినటం వీలు కాదు కాబట్టి రాత్రి తిండిని ‘చక్కెర గుణకం’ ప్రకారం తింటే అటు నిద్రకు ఇబ్బంది లేకుండా చూసుకోవటంతో పాటు ఇటు గ్లూకోజుపై  అదుపు కూడా సాధించవచ్చు.
     తినే ఆహార పదార్థాలు, వాటి తయారీ పద్ధతులను బట్టి కొన్ని త్వరగా గ్లూకోజుగా మారి రక్తంలో కలిస్తే మరికొన్ని చాలా నిదానంగా రక్తంలోకి చేరుతాయి. ఏ పదార్థం ఎంత సేపటిలో గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుందో దాన్ని "చక్కెర గుణకం" (Glycemic index  or GI ) అంటారు.
    పొట్లాలలో దొరికే గ్లూకోజు పొడిని తాగితే వెంటనే రక్తంలోకి చేరి పోతుంది. కాబట్టి గ్లూకోజు చక్కెర గుణకాన్ని 100  గా తీసుకొని దాన్ని పడికట్టుగా ఉంచి మిగతా ఆహార పదార్థాలు దానికంటే ఎంత ఆలస్యంగా కలుస్తాయో పోలుస్తారు. చక్కెర గుణకం ప్రకారం ఆహారాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు
GI : 100 నుండి 70 మధ్యన ఉండేవి - త్వరగా  కలుస్తాయి
ఉదా: గ్లూకోజు
GI : 69 నుండి 56 మధ్యన ఉండేవి -  నిదానంగా కలుస్తాయి 
ఉదా: అన్నం, ప్రాసెసు చెయ్యని గోధుమ ఉత్పత్తులు, చిలగడ దుంప, పంచదార,
GI : 55 కంటే తక్కువ ఉండేవి మరీ ఆలస్యంగా  కలుస్తాయి.
ఉదా. బంగాళ దుంప, పుచ్చకాయ మినహాయించి మిగిలిన పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్డు, దంపుడు బియ్యం.

రాత్రి తినే ఆహారంలో ఈ మూడు సమపాళ్లల్లో ఉండే విధంగా ‘మెను’ తయారు చేసుకొని తింటే వాటి వాటి చక్కెర గుణకం ప్రకారం విడదలు విడతలుగా రక్తంలో కలుస్తుంటాయి. దీనితో రాత్రి 8 గంటల పాటు రక్తపు గ్లూకోజులో పెద్ద తేడా రాదు. దీనికి తోడు పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే ఆహారం జీర్ణం కావటంలో కొంత ఆలస్యం కావటంవల్ల గ్లూకోజు త్వరగా రక్తంలో చేరటాన్ని అపుతుంది.
    ఇలా చెయ్యటానికి కాస్త కష్టంలా అనిపిస్తుంది. కానీ అర్హత పొందిన పోషక నిపుణులను కలిస్తే రోజువారీగా తినే ఆహారంలోనే కొంచెం మార్పులు చేయటం ద్వారా నిద్రకు అనుకూలమయిన ‘మెను’ తయారు చేసి ఇస్తారు.
    ఎంత తినాలి అనేందుకు పరిమితులు లేవు. వారు గతంలో ఎంత తిండి తింటున్నారో అంత తిండి తినవచ్చు. చక్కెర జబ్బు వచ్చిందనగానే చాలా మంది తినంటం తగ్గించేస్తారు. అదనంగా బరువు ఉండి తగ్గాలనుకుంటే తప్ప తగ్గించాల్సిన అవసరం లేదు. ఆ తగ్గించేది కూడా రోజువారీ తిండిలో 5 నుండి 10 శాతం కోత పెట్టి తినొచ్చు.
    చక్కెర జబ్బు వచ్చిన వారికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏమిటంటే తినచ్చు. ఏమేమి తినకూడదు అని. చక్కెర జబ్బు వచ్చిన వారు నాలుగు గంటల వ్యవధిలో కొద్ది కొద్దిగా ఏమైనా తినవచ్చు. ఉదాహరణకు తిరుపతి వెంకన్న లడ్డును మామూలు వారు అయితే ఒకేసారి తింటే చక్కెర వ్యాధిగ్రస్తులు అదే లడ్డూను రోజులో అయిదు సార్లుగా తినవచ్చు. ఉన్న ఒకే ఒక షరతు ఏమిటంటే లడ్డూకు మోయనం మిగతా తిండి తగ్గించాలి. అంతే.
     తినే ఆహార పదార్థాల ‘చక్కెర గుణకం’పై కాస్త అవగాహన ఉంటే ఎలా తినాలి? అనేది అసలు సమస్యే కాదు. వీటిని గురించిన వివరాలు వైద్యం చేస్తున్న డాక్టరును లేదా పోషక నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్టులో ‘“Glycemic index” అని ‘‘వెతుకు మర’’లో కొడితే బోలెడు ‘చోటు'ల్లో ఈ సమాచారం దొరుకుతుంది. మధుమేహం వచ్చాక దానిపట్ల అవగాహన పెంచుకొని, జీవన సరళిని మార్చుకుంటే అది ఇంటిలో ఉండే బొచ్చు కుక్కలా పడి ఉంటుంది. దానిపాటికి దాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే అది పిచ్చి కుక్కలా వెంటాడుతుంది. *
-----------------------
ఆరోగ్యం, వైద్యం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రవర్తనకు సంబంధించిన అంశాలలో మీకు సందేహాలుంటే అడగవచ్చు. ప్రతి బుధవారం ఆంద్రభూమి దిన పత్ర్హిక "సంజీవని"లో సమాధానాలు ఇస్తాను.  వ్యక్తిగతంగా, ఉత్తరాల ద్వారా, ఈ -మెయిల్ ద్వారా సమాధానాలు ఇవ్వటం కుదరదు. దయచేసి మన్నించండి  
చిరునామా: 
డా. పి. శ్రీనివాస తేజ 
సైకియాట్రిస్టు 
మైండ్‌ కేర్ హాస్పిటల్, పొగతోట
నెల్లూరు - 524001

ఆంద్ర భూమి మీకు "వల"లో అందుబాటులో ఉంది
http://www.dc-epaper.com/andhrabhoomi 
http://www.andhrabhoomi.net/sanjeevani

Wednesday, October 20, 2010

పుట్టింది త్వరగా చావటానికా?


52 ఏళ్ళ సత్యమూర్తి ఓ కార్పొరేటు సంస్థకు సి.ఇ.వో. లక్షల్లో జీతం. కాలు బైట పెడితే కారు. తినటానికి వీలు లేకుండా చేతిలో ఫోను. క్షణం తీరిక ఉండదు. రాత్రి ఏ రెండుకో కాని పడుకోవటానికి వీలు కాదు. తెల్లారి ఐదు గంటలకు లేస్తే కూడా పనులు పూర్తికావు. అలాంటి సత్యమూర్తిని ఒకేసారి బీపీ, షుగరు కూడబలుక్కుని ఆవహించాయి. డాక్టరను కలిస్తే వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక మందుల వాడకం ఒక్కటే చాలదనీ, ‘లైఫ్ స్టైల్ మాడిఫికేషన్’ తప్పనిసరి అని చెప్పాడు డాక్టరు. ‘‘అంటే ఏం చేయాలి డాక్టర్!’’ అమాయకంగా అడిగాడు. ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి తగ్గించుకోవటం, రిలాక్సు కావటం అని హెడ్డింగులు మాత్రమే చెప్పి వివరాలు అదే ఆసుపత్రిలో ఉన్న నిపుణులను కలవాలని చెప్పాడు.
                                ********************************

ఎందుకు మార్చు కోవాలి?
ప్రకృతిలో ప్రతి జీవ జాతికి వాటిదైన జీవన విధానం ఉంటుంది. ఏ జాతి జీవులైనా అవి ఉండే ప్రదేశం వేరుగా ఉండవచ్చు కానీ వాటి ప్రవర్తన ప్రకృతి ఆదేశించిన దానికన్నావేరుగా ఉండేందుకు అవకాశం లేదు. ఒక జాతి జీవులన్నీ ఒకే విధమైన ‘‘స్టీరియో టైపిక్’’ ప్రవర్తన కలిగి ఉంటాయి. అంటే మందలో ఏ జంతువును చూసినా వాటి మధ్య తేడా లేకుండా ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉంటాయి. వాటి చేతిలో లేని అంశాలలో తప్ప వాటికి అవిగా తమ ప్రవర్తనవల్ల జబ్బులు కొని తెచ్చుకోలేవు. కానీ మనుషుల ప్రవర్తన ఇతర జీవజాతుల్లాగా ఒకేరకమైన ప్రవర్తనని కలిగి ఉండదు. ఆ మాటకొస్తే ఏ ఇద్దరు మనుషుల ప్రవర్తన ఒక రకంగా ఉండదు. మిగతా సంగతుల్ని అలా వుంచితే ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి ప్రకృతి రూపకల్పన చేసిన శారీరక శ్రమ, తిండి, నిద్రలను విపరీతంగా దుర్వినియోగం చేయటంలో మనిషిది అందె వేసిన చెయ్యి. శరీరాన్ని ఎంతో కొంత కష్టపెట్టటం, అవసరం మేరకు తినటం, తగినంత సేపు నిద్రపోవటమనే సహజ ప్రవర్తనను ఎప్పుడు వదిలేస్తామో ఆ క్షణం నుండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం దురాశే అవుతుంది. 

చేయాల్సినవి చేయకపోవటానికి తోడు, రోగాలను కొని తెచ్చుకొనే ప్రవర్తనని కలిగి ఉండే వారికి ఆరోగ్యం దూరమవటానికి ప్రయత్నం చేస్తుంది. మచ్చుకు పొగతాగటం, మద్యం సేవించటం, మాదక ద్రవ్యాలు వాడటం, నిర్లక్ష్య ప్రవర్తనవల్ల జరిగే ప్రమాదాలు మొదలైనవి. 

ఏ కొద్దిమందికో తప్ప చాలా మందికి ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువ తెలియదు. కొందరికి దెబ్బ తగిలినపుడు తెలుస్తుంది. ఇంకొందరికి తగిలినా తెలియదు.

ప్రతిదీ ఒక దానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్న నేటి జీవనంలో ఆరోగ్యాన్ని పాడుచేయటానికి కావాల్సినన్ని మనకు తెలియకుండానే మన చుట్టూ ముసురుకొని ఉంటాయి. మచ్చుకు గతంలో రోడ్డు వరకూ ‘నడిచి’పోయి బస్సు లేదా ఆటో ఎక్కి ఆఫీసుకు పోయే వారు ‘బైకు’ కొనగానే ఆ నడక కాస్తా దూరం అయి కూర్చుంటుంది. 
తెలివిగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడు కొనే విధంగా జీవన సరళిని మార్చుకోకపోతే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఆరోగ్యానికి సంబంధించి రెండు ప్రయోజనాల కోసం జీవన సరళిని మార్చు కోవాల్సి ఉంటుంది. మొదటిది వచ్చిన జబ్బును తగ్గించుకోవటానికి లేదా అదుపులో ఉంచుకోవటానికి సాధారణ జీవన సరళిని కాస్త మలుపు తిప్పి ప్రత్యేకమైన నడవడికను పాటించాల్సి ఉంటుంది. రెండోది జబ్బు లేక పోయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో భాగంగా జీవన సరళిని మార్చు కోవటం మరో పద్ధతి.

మచ్చుకు అన్నవాహికకు సంబంధించిన ‘పేగు పుండు’ ఉండేవారికి భోజనం చేసి పడుకుంటే ఉన్నట్టుండి తిన్న తిండి గొంతులోకి ఎగదన్నినట్టు ఉండి ఛాతిలో తీవ్రంగా నొప్పి మొదలై నిద్ర లేపేస్తుంది. లేచి కూర్చుంటే కాసేపటికి నొప్పి తగ్గుతుంది. పడుకుంటే మళ్లీ నొప్పి మొదలవుతుంది. రోగ తీవ్రతను బట్టి రాత్రంతా నిద్ర లేకుండా గడిపేవారు ఉన్నారు. ఇది ఒక రోజుతో పోయే జబ్బు కాదు.

మందుల వాడకానికి తోడు మసాలా తిండిని తగ్గించటం లేదా రాత్రిపూట మానేయడం, పొగ పూర్తిగా మానెయ్యటం, ఆల్కహాలు జోలికి పోకుండా ఉండటం, తాగినా రాత్రి వేళ తాగకుండా ఉండటం, పడుకోవటానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేయటం, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవటం, పడుకొనే మంచాన్ని తలవైపున కనీసం అర అడుగు ఎత్తుగా ఉంచు కోవటం అవసరం. ఇది జబ్బును అదుపులో ఉంచు కొనేందుకు వీలుగా మార్చాల్సిన ‘జీవన సరళి’. పై సూత్రాలను పాటించకుండా ఎన్ని మందులు వాడినా జబ్బు అదుపు లోకి వచ్చే సమస్యే లేదు. ఈ సుత్ర్హాలను పాటించటంవల్ల మందుల జోలికి పోవాల్సిన అవసరం దాదాపు ఉండదు.

ఇలా అనేక జబ్బులకు జీవనసరళి మార్పు అవసరం అవుతుంది. ఏ జబ్బుకు ఏ విధంగా నడుచుకోవాలో డాక్టర్లు వివరిస్తారు. జబ్బు వచ్చాకే కాకుండా అనేక జబ్బులకు దూరంగా ఉండటానికి కొన్ని సాధారణ పద్ధతుల్ని పాటించటం అవసరం అవుతుంది.

అవసరం మేరకు తిండి
ప్రకృతిలో మనిషి తప్ప మిగిలిన జంతువులన్నీ అవసరం మేరకే తింటాయి తప్ప అంతకు మించి ఒక్క రవ్వ కూడా ఎక్కువ తినవు. కానీ మనిషి పరిస్థితి అలా కాదు. అవసరానికి మించి అదనంగా తినటంవల్ల ప్రధానంగా వచ్చే సమస్య ఊబకాయం. ఈ ఊబకాయం బీపీ, షుగరు, కీళ్ళవాతం, గుండె జబ్బుల్లాంటి అనేక రోగాలు రావటానికి నెలవుగా ఉంటుంది. ఒకసారి షుగరు వచ్చాక తిండి మీద అదుపు లేకుండా జబ్బును అదుపుచేసే సమస్యే లేదు. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినే విధంగా తిండి అలవాట్లను మార్చుకోవాలి. అలా తినటం నాకు వీలు కాదు అంటే కుదరదు. జబ్బుకు తగ్గట్టు మనం పోవాలే కానీ మన ప్రకారం జబ్బు ఉండదు. దాని పని అది చేసుకుపోతుంది. ఉండాల్సిన బరువుకన్నా అధికంగా ఉన్న ప్రతి కేజీ బరువు వ్యక్తి నేలమీద ఉండాల్సిన రోజుల్ని తగ్గిస్తుంది.

రోజుకో గంట వ్యాయామం:
ఏ వస్తువును అయినా ఉపయోగించకుంటే అది పనికిరాకుండా పోతుంది. దీనికి శరీరం మినహాయింపేమీ కాదు. సోమరితనం అనేక జబ్బులకు నెలవుగా ఉంటుంది. ఇక్కడ సోమరితనం అంటే ప నిలేకుండా కూర్చో వటం అని మాత్రమే కాదు. ప్రతిదానికి యంత్రాలమీద ఆధార పడి ఒంటికి శ్రమ ఇవ్వక పోవటం. రవాణా సాధనాలు అందుబాటు లోకి రావటంతో నడక అరుదై పోతుంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసుకు సైతం ఇంటి ముందు బైకు కిక్కు కొట్టటం, ఆఫీసు ముందు ఆపటం, పోనీ దానికి ప్రత్యామ్నాయంగా పొద్దున ఓ గంట నడుస్తారా అంటే రాత్రి ఆలస్యంగా పడుకొని పొద్దున హడావుడిగా పనులు చక్క బెట్టుకోవటంతో తీరిక ఎక్కడిదీ? శరీర శ్రమ ఏ మేరకు తగ్గుతుందో ఆ మేరకు రోగాలు దగ్గరవుతూ ఉంటాయి. యాభై ఏళ్ళ వయసులో గుండె పోటుకు గురై చనిపోయిన వ్యక్తి రోజులో కొంత సేపు ఒంటిని శ్రమ పెట్టి ఉంటే మరో ఇరవై ఏళ్లు సజీవుడై ఉండేవాడు.

కంటి నిండా నిద్ర:
ఎనిమిది గంటల నిద్ర ప్రతివారికి చాలంటారు వైద్యులు. పరుగులు పెట్టించే నేటి సామాజిక జీవనానికి ఉన్న ఇరవై నాలుగు గంటలు చాలటంలేదు. కాబట్టి చేయ గలిగింది నిద్ర వేళల్లోకి చొరబడి ఆ సమయాన్ని దొంగిలించటం. లక్షల సంవత్సరాలుగా ప్రకృతి సహజంగా 12 గంటలుగా ఉన్న నిద్ర పారిశ్రామిక విప్లవం తరువాత అంటే మూడు వందల ఏళ్ళలో 8 గంటలకు కుదించుకు పోయింది.
ఇంత వేగంగా తగ్గిన నిద్రకు మనసు అలవాటు పడి తట్టు కోగలిగిందే కానీ, శరీరం సర్దుబాటు చేసు కోలేకుండా ఉంది. ఫలితంగా ఆరు, ఏడు పదుల్లో రావాల్సిన గుండె జబ్బులు, పక్షవాతం ఇపుడు ముందుకు జరిగి యాభైలోనే మనిషిని కుదిపేస్తున్నాయ. మరీ ఘోరం ఏమిటంటే గత పుష్కర కాలంలో పిల్లల్లో కార్పొరేటు విద్యవల్ల, పెద్దల్లో టీవీ, కంప్యూటరు వల్ల మరో రెండు గంటలు తగ్గి ఇప్పుడు సరాసరి నిద్ర ఆరు గంటలకు కుదించుకు పోయింది. ఎనిమిది గంటలకు తక్కువగా ఏ మేరకు నిద్ర తగ్గితే దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. మచ్చుకు రోజుకు గంట నిద్ర తగ్గితే అరవై ఏళ్ళకు రావాల్సిన (కుటుంబ చరిత్ర ఉన్నపుడు) షుగరు యాభై ఏళ్ళకే వచ్చి కూర్చుంటుంది. రెండు గంటలు తగ్గితే నలభైకే సిద్ధం.

ఒత్తిడి నుండి ఊరట:
ఒత్తిడి సర్వాంతర్యామి. దానికి ఎంత దూరంగా ఉంటే అంతా, ఎంత ఎదుర్కొనే ఛావ ఉంటే అంతగా ఈ భూమీద ఉండ టానికి అవకాశం పెరుగుతుంది. ఒత్తిడికి గురైనపుడు విడుదల అయ్యే ‘ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్’ అనే క్యాటకాల అమైనులు, ‘కార్టిసాల్’ అనే హార్మోను అవసరానికి మించి విడుదల అయినపుడు శరీరంలో అవయవాల వయసును తగ్గిస్తాయి. నష్ట తీవ్రతను బట్టి తొంభై ఏళ్ళు పని చేయటానికి రూప కల్పన చేసిన గుండె అరవై ఏళ్ళకే చేతులెత్తేయవచ్చు. ఒత్తిడిని జయించ గలిగిన వారు ‘జీవన కాలాన్ని’ జయిస్తారు.
అలవాట్లు:
ఆరోగ్యం చెడి పోవటానికి ఏ అలవాట్లు అయితే పాటిస్తారో అవన్నీ వాటివైన నష్టాలను తెచ్చి పెడతాయి. పొగ తాగటం, మందు బిగించటం, మాదక ద్రవ్యాలు వాడటం, ఇవేకాదు దురుసుగా వాహనాలు నడపటం, దుడుకు ప్రవర్తన, హడావిడి పరుగులు, బాధ్యతా రాహిత్యం కూడా వ్యక్తి ‘జీవిత నాణ్యత’ను, ‘జీవితకాలాన్ని హరించి వేయ వచ్చు.